మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది.
వీటిల్లో తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను హస్తం పార్టీ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజలు బై బై చెప్పేశారు. దీంతో అక్కడ బీజేపీ పార్టీ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజూవారీ కూలీ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని (Seven Time Congress MLA) ఓడించి చరిత్ర సృష్టించాడు.
ఈశ్వర్ సాహు (Ishwar Sahu).. రోజూ వారీ కూలీ. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈశ్వర్ కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు సాహు కుమారుడిని మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సాహు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అదునుగా చూసుకున్న కమలం పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాహుని సాజా అసెంబ్లీ స్థానం (Saja Seat ) నుంచి బరిలోకి దింపారు.
Also Read: YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు..
అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబే ( Ravindra Chaube)పై పోటీలో నిలబెట్టారు. రవీంద్ర చౌబే గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఇక్కడ బీజేపీ వ్యూహం ఫలించింది. అనుకున్నట్లే సాహు.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. సాహు ఏకంగా 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. కమలం పార్టీలో జోష్ నింపారు.