Godavari River – Rajamahendravaram: బ్రిడ్జి పైపును పట్టుకుని అరగంట పాటు వేలాడుతూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 100 నంబరుకు ఫోన్ చేసింది ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన ఓ అమ్మాయి. ఆమె తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఆ బాలిక వయసు 13 ఏళ్లు మాత్రమే. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆ బాలిక పేరు కీర్తన. ఆమె తల్లి పేరు పుప్పాల సుహాసిని. భర్తతో సుహాసిని కొన్నేళ్ల క్రితం విడిపోయింది. ఆమె కూలిపని చేస్తూ కుమార్తె కీర్తనతో జీవిస్తోంది. భర్త లేకపోయినా ప్రశాంతంగానే ఉంటోన్న సుహాసిని జీవితంలోకి రాబందులా సురేశ్ అనే వ్యక్తి వచ్చాడు.
సుహాసినిని మాయమాటలతో మోసగించి, ఆమెతో సురేశ్ సహజీవనం చేశాడు. వారి సహజీవనం ఫలితంగా ఏడాది క్రితం ఓ పాప పుట్టింది. అనంతరం సురేశ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. సుహాసినిని, కీర్తనను, తన ఏడాది పాపను చంపేయాలని, మరో పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని అనుకున్నాడు.
దుస్తులు కొనిస్తానంటూ భార్యను, ఇద్దరు పిల్లలను రాజమహేంద్రవరం తీసుకువెళ్లి, రాత్రంతా కారులోనే తిప్పాడు. ఆదివారం తెల్లవారుజామున రావులపాలెంలోని వంతెన వద్దకు వారిని తీసుకెళ్లి సెల్ఫీ తీసుకుందామన్నాడు. బ్రిడ్జికి చివరలో వారి ముగ్గురిని నిలబెట్టి నదిలోకి తోసేశాడు.
సుహాసిని, ఏడాది పాప నదిలో పడిపోయారు. కీర్తన చేతికి బ్రిడ్జికి ఉన్న పైపు చిక్కింది. దాన్ని పట్టుకుని వేలాడింది. తన జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి 100 నంబరుకు ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. ఆమెను అభినందించారు. కీర్తన తల్లి, చెల్లి నదిలో గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. సురేశ్ కోసం గాలిస్తున్నారు