హైదరాబాద్, 2024 జనవరి 3: హిట్-అండ్-రన్ యాక్సిడెంట్ కేసుల్లో కొత్త శిక్షా చట్టాన్ని నిరసిస్తూ చాలా మంది ట్రక్ డ్రైవర్లు తమ నిరసనను కొనసాగిస్తారని, ఇంధన సరఫరాపై ప్రభావం పడకుండా ఉండటానికి ఇంధన ట్యాంకర్ యజమానులు సమ్మెను విరమించారని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ (సిఐపిడి) అఖిల భారత సంయుక్త కార్యదర్శి రాజీవ్ అమరం మంగళవారం సాయంత్రం ధృవీకరించారు.
ఇప్పటికే చర్లపల్లి, ఘట్కేసర్ నుంచి డీలర్లు ఇంధన రవాణా ప్రారంభించారు. రేపు మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ లోని పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తాయని, ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని ఆయన తెలిపారు.
Also Read: రిలయన్స్ ఇండస్ట్రీస్ అలోక్ ఇండస్ట్రీస్లో రూ.3,300 కోట్లు పెట్టుబడులు
హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో రూ.7 లక్షల వరకు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించే శిక్షా చట్టాల సవరణను నిరసిస్తూ ట్రక్కులన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్ యజమానులు చేపట్టిన ఈ నిరసనతో దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 5,80,000 గూడ్స్ వాహనాలు ఉన్నాయి, వీటిలో 1,80,000 భారీ గూడ్స్ వాహనాలు ఉన్నాయి. ఈ ట్రక్కులు రోజువారీ దేశవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేస్తాయి.