భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్కు ప్రస్తుతం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి కేసీఆర్ మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు.
‘‘నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. త్వరలోనే నేను తిరిగి పనిలోకి వస్తాను’’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
అయితే, 10 రోజుల పాటు తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఆసుపత్రిలో వందలాది మంది రోగులు ఉన్నారు. వారికి ఇబ్బంది కలగకూడదు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావద్దని వైద్యులు చెప్పారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కోలుకుని అందరినీ కలుస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.