'మార్క్ ఆంటోనీ' ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు విశాల్ చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన ఓ ఫ్యాన్ మీట్లో తన తండ్రి జి.కె.రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు' అంటూ అభిమానుల సమక్షంలో విశాల్ను ఆయన తండ్రి సరదాగా పశ్నించారు. దీనికి విశాల్ తరచూ చెప్పే సమాధానమే చెప్పారు. అనంతరం ఆయన.. 'నటి లక్ష్మీమేనన్తో విశాల్ వివాహం' అంటూ వచ్చిన వార్త పేపర్ క్లిప్ను తన తండ్రి భద్రంగా దాచుకున్నారని తెలిపారు.
Also Read: నటి మహాలక్ష్మి, సినీ నిర్మాత రవీంద్రన్ పై చీటింగ్ కేసు..
''విశాల్.. ఇది చాలా సున్నితమైన ప్రశ్న. నేనూ మీ అమ్మ నీ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాం? అలాగే నీ గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా?'' అని జి.కె.రెడ్డి ప్రశ్నించారు. దీనిపై విశాల్ స్పందిస్తూ.. ''నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా. ప్రతి దానికి ఒక సమయం అంటూ రావాలి. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా. ఇక, నా గురించి అన్ని విషయాలు మీకు బాగా తెలుసు. లవ్ స్టోరీలు, బ్రేకప్ కథలు, నడిగర్ సంఘం విషయాలు ఇలా నాకు సంబంధించిన ప్రతి విషయం ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది'' అని బదులిచ్చారు.
అనంతరం తన తండ్రిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ''మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రతి విషయంపై మేము చర్చించుకుంటాం. 'ప్రేమ చదరంగం' (విశాల్ ఫస్ట్ మూవీ) నుంచి ఇప్పటివరకూ నా గురించి వచ్చిన ప్రతి వార్త పేపర్ క్లిక్ను ఆయన దాచి పెట్టుకున్నారు. ఇటీవల ఆయన ఓ పేపర్ క్లిక్ కట్ చేస్తూ కనిపించారు. 'ఏంటి నాన్న అది? ఎందుకు పేపర్ కట్ చేస్తున్నారు?' అని ప్రశ్నించగా.. 'ఇది నీకు సంబంధించిన వార్తే. దాన్ని జాగ్రత్తగా దాయాలని కట్ చేసున్నా'' అని చెప్పారు. ''మార్క్ ఆంటోనీ గురించి ఏమైనా రాశారా?'' అని అడగ్గా.. ''లేదు లక్ష్మీమేనన్తో నీ వివాహం అని రాశారు. ఆ వార్తలో నీ పేరు ఉంది కదా.. అందుకే దాన్ని కట్ చేసి దాచి పెడుతున్నా'' అని అన్నారు. అలా, మా మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది'' అని విశాల్ తెలిపారు.