Buddha Venkanna: రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి మాజీ సభ్యుడు బుద్ధా వెంకన్న తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నానని అన్నారు.
ఈ ఉదయం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. ఆయన నిర్ణయం తనకు శిరోధార్యమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నారు.
అనకాపల్లి లోక్సభ లేదా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోటి నుంచి తాను పోటీ చేయాలని భావిస్తోన్నానని బుద్ధా వెంకన్న వెల్లడించారు. ఈ రెండింట్లో ఒకటి తనకు కేటాయించాలని చంద్రబాబుకు కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తనకు అన్యాయం చేయబోడనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను పక్కన పెట్టే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అందుకే- ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్నానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
టీడీపీ- జనసేన కూటమి టికెట్ల కోసం ఎంతో పోటీ నెలకొందని బుద్ధా వెంకన్న అన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే వారే లేరని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేననీ జోస్యం చెప్పారు. జగన్లో ఓటమి భయం కనిపిస్తోందని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం లభిస్తే.. కనీసం జగన్ స్పందించలేదని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్నామని, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదని విమర్శించారు.