Paytm Pai Platforms : భారత రిజర్వ్ బ్యాంకు (RBI) దెబ్బకు పేటీఎం సంక్షోభంలో పడింది. ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం నుంచి అనేక సంస్థలు దూరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేశాయి. ఈ క్రమంలోనే పేటీఎం తన సర్వీసుల్లో ఒకటైన పేటీఎం ఈ-కామర్స్ సర్వీసు పేరు మార్చేసింది. పై ప్లాట్ఫారమ్స్ (Pai Platforms) అనే కొత్త పేరుతో రిజిస్టర్ చేసుకుంది.
అంతేకాదు.. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పొందే (ONDC)లో విక్రేత ప్లాట్ఫారమ్ అయిన (Bitsila)ను కూడా పేటీఎం కొనుగోలు చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం.. కంపెనీ మూడు నెలల క్రితమే ఈ కొత్త పేరు మార్పు కోసం దరఖాస్తు చేసింది. ఈ నెల (ఫిబ్రవరి 8న) కంపెనీల రిజిస్ట్రార్ నుంచి అనుమతి పొందింది. దాంతో కంపెనీ పేరు పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పై ప్లాట్ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Pai Platforms Private Limited)గా మార్చుకుంది. ఈ సర్టిఫికేట్ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
కంపెనీ వాస్తవానికి పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలీనం అయిందని ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేటీఎం ఇ-కామర్స్లో ఎలివేషన్ క్యాపిటల్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. దీనికి పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, సాఫ్ట్బ్యాంక్, (eBay) సపోర్టు కూడా ఉంది.