ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో టీడీపీ నేత నారా లోకేష్ నిందితుడిగా మారారు. ఆయన్ను ఈ కేసులో ఏ14 నిందితుడిగా చేరుస్తూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు సీఐడీ సిద్దమవుతోంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తెరపైకి వచ్చింది. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించిన ప్రభుత్వం ఆ తర్వాత దీని అలైన్మెంట్లో పలు మార్పులు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఉండవల్లి కరకట్టపై ఇల్లు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు భూములు క్విడ్ ప్రోకోగా దక్కాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ఇప్పటికే సీఐడీ ఏ1గా చేర్చింది. నారాయణను ఏ2గా చేర్చింది. ఇప్పుడు ఇదే కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చింది.
Also Read: చంద్రబాబుకు 6 నెలలు జైలు..!
అమరావతిలో పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన 168.45 ఎకరాల భూమి పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్ మెంట్ మార్చారని, తద్వారా ఆయనకు ప్రయోజనం కల్పించి, ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను క్రిడ్ ప్రోకోగా తీసుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. కానీ ఇన్నరింగ్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగలేదు కాబట్టి ఇందులో లబ్ది అనే మాటే రాదని చంద్రబాబు వాదిస్తున్నారు. కానీ రోడ్డు నిర్మాణంతో సంబంధం లేకుండా మాస్టర్ ప్లాన్ లో లబ్ది కోసమే మార్చారు కాబట్టి అక్రమంగానే చూడాలని సీఐడీ చెబుతోంది.
అలాగే అమరావతిలో లింగమనేని కుటుంబం నుంచి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు భూములు బదలాయించినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ తీసుకున్నట్లు చూపించినా లింగమనేని కుటుంబం అమ్మినట్లు చూపకపోవడం అక్రమంగానే చూస్తోంది. ఇలా భూములు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్ లో లోకేష్ డైరెక్టర్ గా ఉండటం, చంద్రబాబు ఇంట్లో నివసించడం వంటి కారణాలతో ఆయన కూడా లబ్ది పొందారని ఏ14గా చేర్చారు.