IND vs WI T20 Match: కుర్రాళ్లు ఏం చేస్తారో..! మూడో టీ20 మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఔట్.. యువ సంచలనం ఎంట్రీ ..

158

IND vs WI 3rd T20 Match: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌లో పేలువ ప్రదర్శన టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ మినహా భారీ స్కోర్ సాధించడంలో బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌కు జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.

బ్యాటింగ్ విభాగంలో ఇషాంత్ కిషన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అతని స్థానంలో యువ సంచలనం, ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కు అవకాశం ఇవ్వాలని భారత్ జట్టు మేనెజ్ మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ కూడా వరుసగా రెండు మ్యాచ్ లలో విఫలమయ్యాడు. అయితే, సంజూ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. లేకుంటే.. సంజూను తొలగించి ఇషాన్ ను జట్టులో ఉంచే అవకాశాలూ ఉన్నాయి. మొత్తానికి వీరిద్దరిలో తుది జట్టులో ఒక్కరికే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవటం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. సూర్యా ఫాంలోకి వస్తే పరుగుల వరదపారడం ఖాయం. అయితే, మూడో టీ20‌లోనైనా సూర్యకుమార్ పరుగుల వరద పారిస్తారన్న ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

బౌలింగ్ విభాగంలోనూ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గత రెండు మ్యాచ్‌లలో హార్ధిక్ పాండ్యా మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. అర్ష్‌దీప్, ముకేశ్ కీలక సమయంలో పరుగులిచ్చేశారు. ముఖ్యంగా ముకేశ్ పరుగుల కట్టడిలో విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకొచ్చేందుకు హార్దిక్, ద్రావిడ్ భావిస్తున్నారట. స్పిన్ విభాగంలో చాహల్ రాణిస్తున్నాడు. కుల్‌దీప్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. అయితే, కుల్‌దీప్ ఫిట్ గా ఉన్నట్లు, మూడో టీ20 తుది జట్టులో చేరతాడని తెలుస్తోంది. మొత్తానికి మూడో టీ20 మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డైగా మారగా.. వెస్టిండీస్ జట్టు మాత్రం మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

2016 నుంచి భారత్ జట్టుపై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను తామే గెలుచుకుంటామని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ దీమా వ్యక్తంచేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో భారత్, విండీస్ జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో టీమిండియా 17 మ్యాచ్ లలో విజయం సాధించగా, వెస్టిండీస్ జట్టు తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్లు ఫలితం తేలలేదు. మరోవైపు ఈరోజు మ్యాచ్ జరిగే గయానా మైదానం బౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో స్పిన్నర్లకు ఈ పిచ్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. లక్ష్యాన్ని ఛేదించడం ఇక్కడ కొంచెం తేలికే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది.

భారత్ తుది జట్టు (అంచనా) : యశస్వి జైస్వాల్/ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్/ముకేశ్, కుల్దీప్ యాదవ్.

విండీస్ తుది జట్టు (అంచనా) : కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ వూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top