Gandhi Temple in Telangana : 200 ఏళ్లు బ్రిటీష్ దొరల దాస్యంలో మగ్గిపోయిన భారత్ ఎంతోమంది ప్రాణత్యాగాలతో స్వేచ్చావాయువులు పీల్చుకుంది. అది 1947 ఆగస్టు15 అర్థరాత్రి స్వాతంత్ర్యం సిద్ధించిన శుభతరుణం. భారతమాత దాస్య సంకెళ్లు తెంచుకుని స్వేచ్చను పొంది 75 ఏళ్ళు గడిచిపోయాయి. స్వేచ్ఛా వాయువు కోసం పోరాడిని వీరులను గుర్తుచేసుకుంటోంది నవ భారతం. స్వాతంత్ర్య దినోత్సవం అంటే చిన్నా పెద్దలకు గుర్తుకొచ్చేది బోసినవ్వుల బాపూజీ. గాంధీజీ..బాపూజీ ఇలా ఎంతో గొప్పగా గౌరవించుకునే మహాత్మాగాంధీ భారతజాతిపితగా కీర్తించబడుతున్నారు. అటువంటి గాంధీకి గుడులు కూడా కట్టి పూజిస్తున్నాం. దేశం స్వాత్రంత్ర దినోత్సవాల సంబరాలకు సిద్ధమవుతున్న వేళ మన తెలంగాణలోనే గాంధీజి గుడి ఎక్కడుందో తెలుసుకుందాం.
సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. మొక్కులు చెల్లించుకుంటాం. దేవుడు అని ఎవరిని అంటాం. కష్టాన్ని తీర్చినవాడిని దేవుడంటాం. భారతమాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్ర్యం సిద్ధింపజేయటంతో అజరామరమైన పాత్ర పోషించిన దేవుడిగా గాంధీని కూడా కొలుస్తున్న గ్రామం ఒకటుంది తెలంగాణలో. నల్గొండ జిల్లాలోని చిట్యాల్ పట్టణం చుట్టుపక్కల ఉన్న చాలా మందికి మహాత్మా గాంధీ ఆలయం ఉంది.
హైదరాబాద్ మహా నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిట్యాల్ పట్టణానికి సమీపంలోని పెద్ద కాపర్తి గ్రామంలో గాంధీ మహాత్ముడికి మొట్టమొదటిసారిగా గుడిని నిర్మించారు. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ దేవానికి భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో కూడా ఈ దేవాలయాన్ని రోజుకు 100మంది వరకు దర్శించుకుంటారు. అదే స్వాతంత్య్ర దినోత్సం రోజుల్లో ఈ దేవాలయాకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దేవుళ్లకైనా పూజలు చేస్తారు.మరి గాంధీ గుడిలో ఏం చేస్తారు అంటే ప్రార్థనలు చేయడానికి వస్తారు.
కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో విస్తృత ప్రచారం చేయడంతో చాలామంది ఈ దేవాలయానికి వచ్చి గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. గాంధీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. 2014లో నిర్మించిన ఈ ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవంనాడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.