రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. అయితే పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు సార్లు ప్రజల అభిమానం, సంపూర్ణ మద్దతుతో పదేళ్లుగా పరిపాలన అందించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి పరాజయం పాలైంది కేసీఆర్ (KCR)స్థాపించిన భారత రాష్ట్ర సమితీ పార్టీ(BRS Party). ప్రత్యేక రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఓటమిని స్వీకరించిన కేసీఆర్ ఫలితాల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి తన ఫామ్హౌస్కి వెళ్లిపోయారు. మూడ్రోజుల తర్వాత ఆయన మొదటిసారిగా ప్రజల ముందుకొచ్చారు. పరాజయం పాలైనప్పటికి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేకపోయారు కేసీఆర్. అందుకే తన స్వగ్రామం నుంచి పలకరించేందుకు వచ్చిన వందలాది మందిని కలిసేందుకు ఎర్రవెల్లి(Erravelli)లోని తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ కనిపించారు. ఎన్నికల్లో ఓడినప్పటికి చింతకమడక ప్రజలు సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ సొంత గ్రామ ప్రజల్ని పలకరించేందుకు వచ్చిన వీడియో(Video) సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
Also Read: Telangana: డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేశాయి. పదేళ్లుగా పాలన అందించిన పార్టీని ఓడించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారాన్ని అప్పగించారు. సంపూర్ణ మెజార్టీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39సీట్లు గెలుచుకొని అధికారాన్ని కోల్పోయింది. ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల తీర్పును స్వీకరించి తన పదవికి రాజీనామా చేయడంతో పాటు హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ బుధవారం తొలిసారిగా ప్రజల ముందుకొచ్చారు.
సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి తనను చూసేందుకు, పలకరించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆయన్ని చూసిన చింతమడక గ్రామస్తులు 'సీఎం కేసీఆర్' అంటూ నినాదాలు చేశారు. పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి ప్రజలకు ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ కనిపించారు. ఆ సందర్బంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే , కేసీఆర్ మేనల్లుడు హరీష్రావు కూడా ఆయన పక్కనే ఉన్నారు.
Also Read: revanth reddy: రేవంత్ను ఘోరంగా టార్గెట్ చేసిన పోలీసు ఆఫీసర్స్ పరిస్థితేంటి !?
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించిన విధంగానే వచ్చాయి. కాని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆపార్టీ నేతలు మాత్రం కచ్చితంగా ప్రజలు తమను ఆశీర్వదిస్తారని ..మరోసారి అధికారం అప్పగిస్తారని నమ్మకం పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలకు మించి ప్రజలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. గత నెల 30న 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కేసీఆర్ చింతమడకలో ఓటు వేశారు. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో మొత్తం 119 మంది సభ్యులకు గాను 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫలితాల అనంతరం కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి డిసెంబర్ 4న తన ఫామ్హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.